సహస్రపాత్ (పంచాక్షరి)
ఇది ఐదు అక్షరాల మంత్రము. పూజాకాలంలో "సహస్రపాదే నమః” అని శ్రద్ధా భక్తులతో ఉచ్చరించాలి.
“సహస్ర - పాత్” = అనంతమైన పాదములు గలది శ్రీదేవి.
పాద శబ్దమే సమాసంలో పాత్ అని మార్పును పొందింది. పద - గత్ ధాతువు నుండి పాద శబ్దము జనించింది. గతి శబ్దానికి జ్ఞానం అనియు అర్థము. కాళ్ళతో చలనాది గమనములేగాక, సర్వేంద్రియ ప్రవృత్తులును ఇందు సూచింపబడినాయి. ముఖ్యంగా నాల్గింటిని సూచించి నాల్గవ దానిని అన్నింటికి వ్యాపకంగా బోధించాడు ఋషి.
1. శీర్ష = తల - ఇది జ్ఞానాధారమైన మెదడుకు సంకేతము.
2. వదన = ఇది నాల్కకు అనగా వాక్కుకు - తిండికిని సంకేతము.
3. అక్షి = దృగింద్రియ బోధకము.
4. పాదము = ఇది కేవలం కాళ్ళు చేసే పనులకే గాక సర్వేంద్రియముల నడతలకు బోధకము.
శ్రీదేవి స్వరూపాలే అందరి యొక్క అన్ని ఇంద్రియాలు. ఆ తల్లి కరుణచే అవి మనకు లభించాయి. వాటిని దుర్వినియోగం చేయరాదు. అలా చేసినచో మనం మరుజన్మలోవికలాంగులం అయ్యే స్థితియు రావచ్చును.
“శరీరం మే విచర్షణం” (శృతి).
నా శరీరము సత్కార్య కారణయోగ్యమై విరాజిల్లుగాక.
ఈ మంత్రంతో దేవిని ఆరాధించేవారికి ఆ తల్లి కరుణచే సర్వేంద్రియ ప్రవృత్తులు విశుద్ధములై విరాజిల్లగలవు. అందుచే విశుద్ధులై తరిస్తారు.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments