మనది కర్మ భూమి (మహాలయపక్షం రోజుల్లో పితృ కర్మలు)
మనది కర్మ భూమి ఈ కర్మ భూమిలో అనేక మంది మంచి పనులచే భగవంతుని అనుగ్రహం పొందినారు. అలాంటి కర్మలను మనం చాలా విస్మరిస్తున్నాము. పితృ కర్మలు అనగా ఆబ్దీకములు(శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలిపెట్టడము అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.
నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మనవులు తమ పితృ దేవతలను ఉద్దేసించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేసించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నము గాని (భొక్తలకు భోజనము), యామాన్నము గాని (బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి), హిరణ్యము (బంగారము) గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును.
పితృ దేవతలను ఉద్దేసించి మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు ఏ రూపముగా ఇచ్చినను వారికి చేరును.
మనము శ్రాద్ధ కర్మ చేయునపుడు పితృ దేవతలు వాయురూపమున అతి త్వరగా వచ్చి భోజనము భుజింతురు అందుచే శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేయునపుడు సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని కధ ఉన్నది.
మహాలయపక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది.
భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమి పై వ్యాపించి ఉంటుంది. పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ద తో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు.
మహాలయపక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలిదప్పులు తీరుస్తాయి. సంతృప్తి చిందిన పితృ దేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది.
ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు.
0 Comments