Ad Code

వివాహానికి ముందు పసుపును వధూవరులకు ఎందుకు రాస్తారో తెలుసా?


వివాహానికి ముందు పసుపును వధూవరులకు
ఎందుకు రాస్తారో తెలుసా?



పసుపును మనం నిత్యం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. వాటిలోనే కాదు పసుపును శుభకార్యాల్లోనూ ఎక్కువగానే ఉపయోగిస్తుంటాం. ప్రధానంగా పెళ్లి విషయానికి వస్తే పసుపు లేనిదే ఆ శుభకార్యం ఉండదు. ఆ వేడుకలో ప్రతి సందర్భంలోనూ పసుపు వాడకం ఎక్కువే. ముఖ్యంగా వధూ వరులకు చేయించే మంగళ స్నానానికి ముందు వారికి పసుపు బాగా రాస్తారు. అయితే పెద్దలు ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? దాని గురించే ఇప్పుడు చూద్దాం!

1. ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు వంటి వాటిని తొలగించడంలో పసుపు బాగా పనిచేస్తుంది. వివాహ కార్యక్రమంలో పాల్గొనే వధూ వరులు మరింత ప్రకాశవంతంగా కనిపించాలనే ఉద్దేశంతోనే పసుపును వారికి రాసి స్నానాలు చేయిస్తారు.

2. పసుపులో కర్క్యుమిన్ అనబడే ఓ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ డిప్రెస్సెంట్‌గా పనిచేస్తుంది. అంటే మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. తలనొప్పిని కూడా దూరం చేస్తుంది. అవి లేకుండా ఉంటేనే కదా ఎవరైనా ఉత్తేజంగా ఉండేది. అందుకోసమే వధూవరులకు పసుపు రాస్తారు.

3. యాంటీ సెప్టిక్ గుణాలు పసుపులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంపై అయిన దెబ్బలు, గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. వాటి స్థానంలో ఏర్పడే మచ్చలను కూడా తొలగిస్తాయి. కనుకే పసుపును వధూవరులకు రాయడంలో ప్రాధాన్యతనిస్తారు.

4. హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపు అనేది శుభానికి గుర్తు. ఆరోగ్యాన్ని కలిగించే ఓ ఔషధి. సంపదను ఇచ్చే కల్పవల్లి. అందుకే దీన్ని వధూవరులకు రాస్తారు.

5. శరీరంలో చేరిన దుష్ట శక్తులను పారదోలే పవర్ పసుపుకి ఉందట. అందుకే వధూవరులపై ఎలాంటి గాలి, ధూళి లేకుండా ఉండేందుకు గాను వారికి పసుపు రాస్తారు.

6. పసుపుతోపాటు చందనం, రోజ్ వాటర్ వంటి పదార్థాలను కలిపి వధూ వరులకు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు. దీంతో వారిలో పెళ్లి కళ మరింత ఉట్టిపడుతుందని పలువురు భావిస్తారు.


Post a Comment

0 Comments